చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఏం గాడిదలు కాశారు..? – జగన్

అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విపక్షనేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు తనకు లేఖ రాశారని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారంటూ మండిపడ్డారు. కుప్పం ప్రజలు ఒత్తిడి వల్ల రెవెన్యూ డివిజన్ పై తనను అడక్క తప్పలేదని అన్నారు సీఎం జగన్. 75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే, తాము 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. వికేంద్రీకరణ అంటే ఇదేనని ఉద్ఘాటించారు. అమరావతిలో బినామీల కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖకు మాత్రమే కాదు, విజయవాడకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని సీఎం జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాకే విజయవాడలో అభివృద్ధి జరుగుతోందని, 65 శాతం నిధులు ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మరి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వికేంద్రీకరణపై చంద్రబాబు మాటలు అర్థరహితం అని కొట్టిపారేశారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో గోదావరి వరదల సమయంలో వెల్లడైందని, అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి వరదల నుంచి ప్రజలను ఆదుకున్నాయని సీఎం జగన్ వివరించారు.