పరిషత్ ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందన
ఏపీలో మరోసారి వైసీపీ పార్టీ తమకు తిరుగులేదని నిరూపించింది. శాసన ఎన్నికల దగ్గరి నుండి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన హావ కనపరుస్తూ వస్తున్న వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగానే ఫ్యాన్ గాలి వీచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుని, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 81 శాతం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ 99 శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచారని అన్నారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.