పీవీ సింధుపై ఏపీ సీఎం జగన్ ప్రశంసలు
సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన సింధును ట్విటర్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. యావత్ దేశం గర్వించే విజయాన్నందుకున్నావని కితాబిచ్చారు.
‘సింగ్పూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు అభినందనలు. ఇది ఆమెకు తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్. ఈ ఏడాది మూడో టైటిల్. ఈ విజయానికి ముందు సింధు కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గింది. యావత్ భారత్ గర్వించే విజయాన్నందుకుంది’ అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్లో దారుణంగా ఓడిపోయింది. తర్వాత చివరిదైన మూడో గేమ్లో అద్భుత ప్రతిభ కనబరిచి, సింగపూర్ ఓపెన్, సూపర్ 500 టైటిల్ గెలుచుకుంది. భారత దేశం నుంచి ఈ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఇంతకుముందు ఈ టైటిల్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది.
ఆసియా ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడలిస్ట్, 22 ఏళ్ల వాంగ్.. సింధు ముందు తేలిపోయింది. తొలి సెట్ను అలవోకగా నెగ్గిన భారత షట్లర్.. రెండో సెట్ను 11-21తో కోల్పోయింది. మూడో సెట్ను మళ్లీ 21-15తో గెల్చుకొని.. ట్రోఫీని కైవసం చేసుకుంది.జులై 28 నుంచి బర్మింగ్హామ్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్కు ముందు ఈ విజయం సింధుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ సీజన్లో సింధుకు మొత్తంగా ఇది మూడో టైటిల్. ఇప్పటికే 2022లో రెండు సూపర్ 300 టైటిళ్లు గెల్చుకుంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, తను మరో మెట్టు ఎక్కేందుకు దోహద పడుతుందని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.