శ్రీవారిని దర్శంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు
శ్రీవారి చెంత పీఎస్ఎల్వీ సీ49 నమూనా రాకెట్
తిరుమల: ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ49 నమూనా రాకెట్ను ఇస్రో శాస్ర్తవేత్తలు శ్రీవారి చెంత ఉంచి పూజలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం శ్రీహరికోట షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ49 నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ సీ 49 రాకెట్ భూ పరిశీలన (నిఘా) ఉపగ్రహం రిశాట్ 2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. కొవిడ్ 19 మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించాయి. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.
రిశాట్2 బీఆర్2 శాటిలైట్ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. అలాగే నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/