‘సౌండింగ్ రాకెట్’ ను ప్రయోగించిన ఇస్రో

గాలుల్లో తేడాలు తెలుసుకునేందుకు ప్రయోగం

శ్రీహరికోట : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఆర్‌హెచ్‌- 560 సౌండింగ్ రాకెట్‌ను శుక్రవారం రాత్రి నింగిలోకి పంపింది. ఈ మేరకు ఇస్రో అధికారిక ఖాతా ట్వీట్‌ చేసింది. వివిధ ఎత్తుల్లోని తటస్థ గాలుల్లో తేడాలు, ప్లాస్మా గతిశాస్త్ర వివరాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేసినట్టు ఇస్రో ప్రకటించింది. సౌండింగ్ రాకెట్లను అంతరిక్ష పరిశోధనల కోసం పర్యావరణంలోని వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు ప్రయోగిస్తుంటారు. ఒకటి లేదా రెండు దశల ఘన ఇంధన రాకెట్లివి. వాహక నౌకలు, ఉపగ్రహాల్లో వాడే ఉప వ్యవస్థలు లేదా కొత్త పరికరాల ప్రొటోటైప్ ల పనితీరును తెలుసుకోవడం కోసం టెస్ట్ చేసేందుకు ఈ సౌండింగ్ రాకెట్లను వినియోగిస్తుంటారు. పైగా వీటికయ్యే ఖర్చు కూడా తక్కువే.

ప్రస్తుతం ఇస్రో వద్ద మూడు రకాల సౌండింగ్ రాకెట్లున్నాయి. ఆర్ హెచ్ 200, ఆర్ హెచ్ 300 మార్క్2, ఆర్ హెచ్ 560 మార్క్ 2 రాకెట్లు.. 80 నుంచి 100 కిలోల వరకు పేలోడ్ లను మోసుకెళ్లగలవు. 80 కిలోమీటర్ల నుంచి 475 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలవు. 1965లో తొలిసారిగా ఇస్రో సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. వాటిని దేశీయంగానే తయారు చేస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/