నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈరోజు ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్ను ప్రయోగించింది.
చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగించారు.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)లతో ఎన్నో విజయవంతమైన మిషన్లను పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు తొలి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి అంతరిక్ష రంగంలో సత్తా చాటింది. ఎస్ఎస్ఎల్వీల ద్వారా శాటిలైట్లను భూమి లోయర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. గత కొద్ది వారాలుగా శాస్త్రవేత్తలు స్మాల్ లాంచ్ వెహికల్స్ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిన్న శాటిలైట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ఇస్రో అడుగులు వేస్తూ.. ఇవాళ ఎస్ఎస్ఎల్వీ, ఆజాదీ శాట్ లను ప్రయోగించింది.