మరో ఆరు నెలల్లో అమెరికాపై ఉగ్రదాడులు జరిగే ముప్పు!

కాంగ్రెస్ కు పెంటగాన్ అధికారి వెల్లడి

న్యూఢిల్లీ: అమెరికాపై మరో ఆరు నెలల్లో ఉగ్రవాద దాడి జరిగే ముప్పుందని ఆ దేశ రక్షణ రంగ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో ఇస్లామిక్ స్టేట్ (ఖొరాసన్) ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై నుంచే ఐఎస్కే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పెంటగాన్ అధికారులు ప్రకటించారు.

ఆ ముప్పు చాలా తీవ్రంగా ఉంటుందని అమెరికా కాంగ్రెస్ కు వివరించారు. ఐఎస్కేతో తాలిబన్లకు శత్రుత్వం ఉందని, దీంతో వారిపై ఉక్కుపాదం మోపేందుకు చట్టం తీసుకురావాలని తాలిబన్లు యోచిస్తున్నారని అన్నారు. తాలిబన్లు వారిపై గెలుస్తారా? అన్నది అనుమానమేనని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు ఐఎస్కేతో ఎప్పటికైనా ముప్పేనని అధికారులు హెచ్చరించారు. కొన్ని వేల మంది ఉగ్రవాదులు అందులో ఉన్నారని, అమెరికాపై దాడి చేసేలా సంస్థ వారిని తయారు చేస్తోందని చెప్పారు. అల్ ఖాయిదా కూడా దాడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోందన్నారు. తాలిబన్ల సాయంతో ఆ ఉగ్రసంస్థ మళ్లీ బలపడే అవకాశం ఉందన్నారు. రెండేళ్లలో అది కూడా అమెరికాపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/