విమానాన్ని కూల్చేసింది మేమే:ఇరాన్

మానవ తప్పిదమే ఘటనకు కారణమన్న ఇరాన్

Ukrainian jetline
Ukrainian jetline

టెహ్రాన్‌: ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలి, పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 176 మంది దుర్మరణం పాలయ్యారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తించింది. విమానాన్ని కూల్చింది ఎవరు? అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ తరుణంలో, విమానాన్ని తామే కూల్చేశామంటూ ఇరాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి జవద్ జరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని తెలిపారు. కేవలం మానవ తప్పిదంగానే దీన్ని పరిగణించాలని కోరారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు దారి తీశాయని చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు, తమ పౌరులను కోల్పోయిన దేశాలకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు.

విమానం కూలిపోయిన తర్వాత… ఇరానే ఈ చర్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. కానీ, ఇరానే విమానాన్ని కూల్చిందంటూ అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రకటించాయి. దీనికి తోడు, విమానాన్ని ఓ అగ్నిగోళం వంటి వస్తువు తాకిన ఓ వీడియో కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంతో, చివరకు ఇరాన్ నిజాన్నిఒప్పుకోక తప్పలేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/