ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చని , విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.
ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయని అధికారులు తెలిపారు. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూలై 22న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు అధికారులు.
ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 464892 విద్యార్థులకు గాను 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు. ఇక సెకండియర్లో 67.96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.