21 ఏళ్ల తర్వాత భారత్ కు దక్కిన విశ్వసుందరి కిరీటం

21 ఏళ్ల తర్వాత భారత్ కు విశ్వసుందరి కిరీటం దక్కింది. భారత యువతి హర్నాజ్ సంధు మిస్​ యూనివర్స్​-2021 కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

2 వేల సంవత్సరంలో చివరగా భారత్ కు చెందిన లారా దత్తాకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. అంతకు ముందు సుస్మితా సేన్ విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. ఇన్నాళ్లకు హర్నాజ్ కౌర్ సంధుకు ఈ ఖ్యాతి దక్కింది. పరాగ్వే, సౌత్ ఆఫ్రికా నుంచి పోటీలో ఉన్న వారిని వెనక్కు నెట్టి హర్నాజ్ అందరి మనసు గెలుచుకుంది. 2020 మిస్ యూనివర్స్ మెక్సికోకు చెందిన అండ్రియా మీజా నుంచి మిస్ యూనివర్స్ కిరీటం అందుకుంది.

హర్నాజ్ కౌర్ తర్వాత పరాగ్వే, సౌతాఫ్రికా నుంచి పాల్గొన్న యువతులు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఇవాళ్టి రోజుల్లో యువతులకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను ఎలా డీల్ చేస్తారని నిర్వాహకులు హర్నాజ్ కు ప్రశ్న అడిగారు. దీనికి హర్నాజ్ చాలా తెలివిగా అద్భుతమైన సమాధానం చెప్పడంతో నిర్వాహకులను ఆకట్టుకున్నారు. యువత ఇతరులతో పోల్చుకోవడాన్ని ఆపాలని, ప్రపంచంలో జరుగుతున్న ఇష్యూస్ పై రియాక్ట్ అవ్వాలని అన్నారు. మీ జీవితానికి మీరే లీడర్లు అని, మీకోసం మీరు మాట్లాడేందుకు బయటకు రావాలని యువతకు పిలుపునిచ్చారు.

హర్నాజ్‌ వయసు 21 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నారు. కిరీటాన్ని అందుకున్న ఆనందంలో కన్నీరు పెట్టుకుంది.