అమెరికాలో భారత సంతతి యువకుడి దారుణ హత్య

అమెరికా లో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు భారత సంతతికి చెందిన యువకుడు జూడ్ చాకో (21) ను అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఫిలడెల్ఫియా నగరంలో చోటుచేసుకుంది. రోజూవారిలాగానే జూడ్ చాకో ఆదివారం ఆఫీసు నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీ చేసే క్రమంలో అతడిపై కాల్పులు జరిపారు. జూడ్ తల్లిదండ్రులు కేరళ వాస్తవ్యులు. 30 ఏళ్ల క్రితం వారు అమెరికాకు వలస వెళ్లారు. విద్యార్థి అయిన జూడ్ స్థానికంగా పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు.

మరోవైపు, ఈ ఘటనతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఓహాయోలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయీశ్‌ వీరాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో అతడు మరణించాడు. ఇలా వరుసగా భారత సంతతికి చెందిన వారు మరణిస్తుండడం తో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది.