రైల్వే శాఖ ప్రైవేటీకరణపై స్పందించిన మంత్రి పియూష్‌

రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోము ..మంత్రి పియూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.  రైల్వే గ్రాంటుల కోసం వస్తున్న డిమాండ్లపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు గోయల్ ఈ మేరకు స్పందించారు. ‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై నడపాలని ప్రజలు ఎప్పుడూ అనరు. ఎందుకంటే ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు రెండూ ఆర్థికంగా సహాయపడతాయి. రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడ సేవలను మరింత మెరుగు పరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలి” అని గోయల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో దేశ రైల్వే మౌలిక సదుపాయాలు కొత్త విజన్‌ను చూశాయని, రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు లోక్‌సభలో పియూష్‌ గోయల్ చెప్పారు.

మోడీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వేలో పెట్టుబడులను రూ. 2.15 లక్షల కోట్లకు పెంచిందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1.5 లక్షల కోట్లుగా ఉంది. రెండేళ్లుగా భారతీయ రైల్వేలో యాక్సిడెంట్ కారణంగా ఒక్కరుకూడా చనిపోలేదని మంత్రి పేర్కొన్నారు.  ‘‘ప్రయాణికుల భద్రత, పెట్టుబడులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. రైల్వే ప్రమాదం కారణంగా ఓ ప్రయాణికుడు మృతిచెందిన ఘటన చివరి సారి 2019 మార్చిలో చోటుచేసుకుంది. అయితే 2019 నుంచి 2021 వరకు రెండేళ్లుగా ఒక్కరు కూడా ప్రమాదాల్లో చనిపోలేదు…’’ అని గోయల్ పేర్కొన్నారు. 

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: