సరిహద్దుల వద్ద భారత వాయుసేన విన్యాసాలు
చైనా మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడకుండా భారత్ అప్రమత్తం
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వద్ద అర్ధరాత్రి వేళ భారత వాయుసేన విన్యాసాలు జరిపాయి. సరిహద్దులోని ఎయిర్ బేస్లో ఐఏఎఫ్కు చెందిన మిగ్29 యుద్ధ విమానాలు, దాడి చేయగల సామర్థ్యమున్న అపాచీ హెలీకాప్టర్లు, అధిక బరువులను మోయగల చినూక్ హెలీకాప్టర్లు ఈ నైట్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కాగా, భారత వాయుసేన సన్నద్ధతను పరీక్షించేందుకు ఇలాంటి నైట్ ఆపరేషన్లు ఆశ్చర్యం కలిగిస్తాయని ఇందులో పాల్గొన్న గ్రూప్ కెప్టెన్ ఏ రతి తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్తా చాటేందుకు వాయుసేనకు చెందిన సుశిక్షులైన సిబ్బంది ఎప్పుడూ సిద్ధమేనని ఆయన చెప్పారు.
కాగా గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ దీటుగా స్పందించడంతో చైనా ఎట్టకేలకు వెనక్కు తగ్గి, నిన్న దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయింది. దశల వారీగా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నాయి. అయితే, శాంతి కోసం చర్చలు జరుపుతూనే దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనాను నమ్మే పరిస్థితి లేదు. చైనా బలగాలు నిజంగానే వెనక్కి వెళ్లిపోయాయా? అన్న అంశాన్ని భారత్ ఎప్పటికప్పుడు నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత రాత్రి భారత్ చైనా సరిహద్దుల వద్ద భారత వైమానిక దళానికి చెందిన మిగ్29 యుద్ధ విమానం చక్కర్లు కొట్టింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/