వ్యాక్సిన్..ఫైజర్తో కేంద్రం చర్చలు
ధర విషయంలోనూ ఇంకా రాని స్పష్టత
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కాగా, యూఎస్ ఫార్మాస్యుటికల్ దిగ్గజం ఫైజర్, జర్మనీ బయోటెక్ సంస్థ బయో ఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఇండియాకు తెచ్చేందుకు కేంద్రం చర్చలు ప్రారంభించింది. తమ వ్యాక్సిన్ 90 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తోందని రెండు రోజుల క్రితం ఫైజర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ ను ఇండియాలో వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఫైజర్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది.
ఇండియాకు సంబంధించినంత వరకూ ఫైజర్ తో ఇంతవరకూ ఎటువంటి ఒప్పందమూ కుదరలేదు. వ్యాక్సిన్ ను ఇండియాకు తెచ్చేలా ఒప్పందం కుదిరితే, వినియోగానికి అనుమతించే ముందు లోకల్ ట్రయల్స్ ను నిర్వహించాలని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి వుండగా, ఇండియాలో వ్యాక్సిన్ నిల్వకు అవసరమైన మౌలిక వసతులపై కొన్ని అనుమానాలను వైద్య ఆరోగ్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ టీకా ఆర్ఎన్ఏ ఆధారంగా తయారైనది కావడంతో అత్యంత శీతల వాతావరణంలోనే భద్రపరచాల్సి వుంటుంది. దీంతో కోల్డ్ చైన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై ప్రభుత్వం మరింత దృష్టిని సారించాల్సి వుంది. ఇక దీని ధరపైనా ఇంకా స్పష్టత రాలేదు. ధర విషయంలోనూ డీల్ కుదరాల్సి వుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/