న్యూజిలాండ్కు 297 టార్గెట్ ఇచ్చిన టీమిండియా

మౌంట్ మౌంగనూయి: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్కు భారత్ 297 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ కు దిగడంతో భారత్ బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్ చివరి బంతికే కివీస్ బౌలర్ జెమిసన్ షాకిచ్చాడు. ఒక్క పరుగు చేసి బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్నెట్ బౌలింగ్లో జెమిసన్కు క్యాచ్గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 7వ ఓవర్ నాలుగో బంతికే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం మూడు ఫోర్లు, రెండు సిక్స్లతో 40 పరుగులు చేసి రాణించాడు. డీ గ్రాండ్హోమ్ బౌలింగ్లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(62) హాఫ్ సెంచరీతో, లోకేష్ రాహుల్(112) సెంచరీతో రాణించారు. మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ చెరో 8 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్కు చెరో వికెట్ దక్కింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/