ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్‌ అత్యవసర మందులు పంపిణి

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్‌ అత్యవసర మందులు పంపింది. మనవతా సహాయంగా వీటిని సమకూర్చింది. కాబూల్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులకు వీటిని అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో సవాలుగా మారిన మానవతావాద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం ఈరోజు తిరుగు ప్రయాణ విమానంలో వైద్య సామాగ్రితో కూడిన మానవతా సహాయాన్ని పంపింది. ఈ మందులు కాబూల్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధులకు అందజేస్తాం. కాబూల్‌లోని ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో వీటిని వినియోగిస్తారు’ అని పేర్కొంది.

కాగా, భారత్‌ నుంచి మొదటి వైద్య సహాయంగా అందజేసిన మందులు శనివారం ఉదయం కాబూల్‌కు చేరుకున్నాయని భారత్‌లోని ఆఫ్ఘనిస్థాన్‌ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌ అందజేసిన 1.6 మెట్రిక్ టన్నుల ప్రాణాలను రక్షించే మందులు అనేక కుటుంబాలకు సహాయ పడతాయని అన్నారు. ‘భారత ప్రజల బహుమతి’ గా ఆయన అభివర్ణించారు.

మరోవైపు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్‌ నుంచి ఆ దేశానికి అందిన తొలి సహాయం ఇదే. శుక్రవారం కాబూల్‌ నుంచి ప్రత్యేక విమానంలో 104 మంది ప్రజలతోపాటు సిక్కు, హిందూ మతాలకు చెందిన పురాతన పవిత్ర గ్రంథాలు ఢిల్లీకి చేరుకున్నాయి. 104 మందిలో పది మంది భారతీయులు కాగా, 94 మంది ఆఫ్ఘన్ జాతీయులు. ఈ విమానం తిరుగు ప్రయాణంలో అత్యవసర మందులను భారత్‌ పంపింది.

కాగా, పాకిస్థాన్ మీదుగా రోడ్డు రవాణా ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌కు 50,000 టన్నుల గోధుమలు, మందులను పంపుతామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటి రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఇరు దేశాలు ఖరారు చేస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/