ఆగస్టు నెల‌లోనే క‌రోనా థ‌ర్డ్ వేవ్.. ఎస్‌బీఐ రిపోర్ట్‌

సెప్టెంబరు నాటికి పీక్‌ స్టేజ్‌ దాటవచ్చు
నిబంధనలు పాటించకపోతే ముప్పే..: ఎస్‌బీఐ

న్యూఢిల్లీ : క‌రోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌పై ఆందోళన నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా సర్వే కీలక విషయాలను వెల్లడించింది. ఆగ‌స్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది. కొవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను రూపొందించింది. ఇక కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది.

ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచ‌నా వేసింది.

రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు..

•క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో న‌మోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు గ్లోబ‌ల్ డేటా చెబుతోంది.
•ఆగ‌స్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డం ప్రారంభ‌మై.. నెల‌లోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది.
•ఇక వ్యాక్సినేష‌న్ల విష‌యానికి వ‌స్తే.. దేశంలో స‌గ‌టున రోజుకు 40 ల‌క్ష‌ల‌ వ్యాక్సిన్లు ఇస్తున్నారు.
•దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/