యూకే బాటలో నిర్ణయం తీసుకున్న భారత్

యూకే పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన భారత్

న్యూఢిల్లీ: యూకే ప్రభుత్వానికి భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలపై యూకే ప్రభుత్వం ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ ప్రయాణికులు ఇకపై క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించిన యూకే.. భారత్ విషయంలో మాత్రం వివక్ష చూపింది. భారత్ నుంచి వచ్చే వారిని వ్యాక్సిన్ తీసుకోని వారిగానే పరిగణిస్తామని ప్రకటించింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, లేదంటే తప్పకుండా ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించింది. దీనికి ఏవేవో సాకులు చెప్పిన యూకే ఈ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. దీంతో భారత్ కూడా దెబ్బకు దెబ్బగా యూకే ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4 నుంచి యూకే పౌరులెవరైనా భారత్ రావాలనుకుంటే వెంట కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది.

అంతేకాదు, వాళ్లు భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత కచ్చితంగా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూకేలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోందని, తమ నిర్ణయానికి ఇది కూడా కారణమని అధికారులు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/