భారత్‌ శాంతిని ఇష్టపడే దేశం..రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత్‌ సార్వభౌమత్వాన్ని కాపాడాలని నిశ్చయించుకుంది..రాజ్‌నాథ్‌సింగ్‌

Defence Minister Rajnath Singh

హైదరాబాద్‌: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డిఫెన్స్‌ కాలేజీ గురువారం నిర్వహించిన వర్చువల్‌ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని నిశ్చయించుకుందని ఆయన అన్నారు. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రాముఖ్యం ఇస్తుందని, సరిహద్దులో శాంతిని కాపాడుకోవడానికి వివిధ ఒప్పందాలను గౌరవించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌ఏసీ వెంట చైనాతో సరిహద్దుల్లో ఏడు నెలలుగా నెలకొన్న పరిస్థితులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతిని ఇష్టపడే దేశమని, విభేదాలు వివాదాలుగా మారకూడదని నమ్ముతున్నామన్నారు.

భారత్‌ చైనా మధ్య ఈ ఏడాది మేలో వివాదం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమస్యను పరిష్కరించేందుకు ఇరుపక్షాలు దౌత్య, సైనిక చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఎనిమిదో రౌండ్‌ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు శుక్రవారం జరిగే అవకాశం ఉంది. ఇంకా రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశ సైనిక పరాక్రమం, దేశీయ రక్షణ ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై మాట్లాడారు. యుద్ధాన్ని అరికట్టే సామర్థ్యం ద్వారా మాత్రమే శాంతిని నిర్ధారించవచ్చని, సామర్థ్యాల అభివృద్ధి, స్వదేశీకరణ ద్వారా నిరోధాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/