ఉత్కంఠపోరులో భారత్ ఘనవిజయం..

ఉత్కంఠపోరులో పాకిస్థాన్ ఫై భారత్ ఘనవిజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు మొదట్లోనే భారీ షాక్ లు తగిలాయి. రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో జట్టు భారాన్ని భుజాలపై వేసుకున్న విరాట్ కోహ్లీ (82 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా (40) అండగా నిలబడటంతో కోహ్లీ రెచ్చిపోయాడు.

చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా మొదటి బంతికే పాండ్యా అవుటయ్యాడు. ఆ తర్వాత సింగిల్, డబుల్ వచ్చాయి. ఆ మరుసటి బంతికి కోహ్లీ సిక్సర్ కొట్టాడు.. అది నోబాల్. ఫ్రీ హిట్ డెలివరీ వైడ్ అయింది. దీంతో మరో బంతి వేశారు. దీనికి మూడు రన్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. ఈ సమయంలో దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాడు. మరుసటి బంతి వైడ్. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది.