భార‌త్ ఘ‌న‌త‌..100 కోట్ల డోసుల పంపిణీ

దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేష‌న్ ప్రారంభం

న్యూఢిల్లీ : క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు చైనా మాత్ర‌మే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించింది. దేశంలో మొద‌ట నెమ్మ‌దిగా ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన్ని నెల‌ల‌కే పుంజుకుంది.

దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి హెర్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభించారు. అనంత‌రం క‌రోనా ఫ్రంట్ లైన్ యోధుల అంద‌రికీ ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. దేశంలో ఫిబ్రవరి 19న‌ కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న‌ 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా భార‌త్ నిలిచింది.

ఈ ఏడాది జూన్ 12న‌ 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న‌ 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింద‌ని కొవిన్ పోర్ట‌ల్‌లో పేర్కొన్నారు. మొద‌ట వ్యాక్సిన్లు వేయించుకునేందుకు భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు అనంత‌రం భారీగా టీకా కేంద్రాల‌కు త‌ర‌లివెళ్లి వేయించుకోవ‌డం గ‌మ‌నార్హం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/