ఉప్పల్ స్టేడియంలో భారత్ ఘన విజయం

ఆదివారం ఉప్పల్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే సిక్స్ బాదిన కోహ్లి (48 బంతుల్లో 63).. రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించి ఔటయ్యాడు. దీంతో అందర్నీలో టెన్షన్ మొదలైంది. కానీ ఐదో బంతికి ఫోర్ బాది..టీమ్ ఇండియా కు విజయం అందించారు హార్దిక్ పాండ్య .

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) ధాటిగా ఆడటంతో ఆసీస్ జట్టు 186/7 స్కోరు సాధించింది. 187 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు ఆడిన రోహిత్ శర్మ (17) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ (69), కోహ్లీ (63) జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. సూర్య అవుటైన తర్వాత ఆసీస్ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేయడంతో కొంత టెన్షన్ నెలకొంది. ఇక ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతికే అతను అవుటయ్యాడు. ఆ ఓవర్ ఐదో బంతి.. పాండ్యా (25 నాటౌట్) బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లడంతో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్‌ బ్యాటింగ్‌ చూస్తే.. సూర్యకుమార్‌ 69, కోహ్లీ 63 పరుగులు చేయగా, హార్దిక్‌ పాండ్యా 25(నాటౌట్‌), రోహిత్‌ శర్మ 14 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌: డేనియల్‌ శామ్స్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చూస్తే.. గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54 పరుగులు చేయగా, డేనియల్‌ సామ్స్‌ 28(నాటౌట్‌), జోష్‌ ఇంగ్లీస్‌ 24 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్: అక్సర్ పటేల్ (3), భువనేశ్వర్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌ ఒక్కోక్క వికెట్ పడగొట్టారు.