ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియా

Mukesh-Ambani-Satya Nadella
Mukesh-Ambani-Satya Nadella

ముంబయి: ముంబయిలో జరుగుతున్న ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ముచ్చటించారు అతి త్వరలో ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియా మారుతుందని ముఖేశ్ అంబానీ అన్నారు. భారత్ ఏ విధంగా దూసుకుపోతోంది? ఆర్థిక శక్తిగా ఎదగడానికి, డిజిటల్ రంగంలో రాణించడానికి దోహదపడ్డ విషయాలపై ఆయన మాట్లాడారు. ప్రఖ్యాత డిజిటల్ సమాజంగా భారత్ మారుతుందని, మొబైల్ నెట్‌వర్క్స్ పనితీరు అమోఘంగా పెరగడమే భారత పరివర్తనానికి ప్రధాన కారణమని అన్నారు.

ఇంతకుముందుతో పోల్చితే భారత్‌లో మొబైల్ నెట్‌వర్క్స్ వేగంగా వృద్ధి చెందాయన్నారు. ప్రధాని మోడి 2014లో ఇచ్చిన ‘డిజిటల్ ఇండియా’ పిలుపుతోనే భారత్ పరివర్తనం చెందడానికి కారణమైందని, అప్పుడే ఈ రంగం ఊపందుకుందని వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాత 380 మిలియన్ వినియోగదారులు జియో 4జీ టెక్నాలజీకి మారారని ముఖేశ్ అంబానీ చెప్పారు. మొబైల్ రంగంలోకి జియో కాలు పెట్టే కంటే ముందు దేశంలో సగటు డేటా స్పీడ్ 256 కేబీపీఎస్‌గా ఉండగా, జియో వచ్చాక 21 ఎంబీపీఎస్‌కు చేరిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై మాట్లాడుతూ.. గత అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా వచ్చినప్పటికి, ఇప్పటికి భారత్‌లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఆ ప్రధాన కారణాల్లో ఒకటి మొబైల్ కనెక్టివిటీ అని స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/