మునుగోడు లో ఇండిపెండెంట్ అభ్యర్థుల నిరసన

Independent candidates protest in Munugodu


మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటి తో ముగియనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నిరసన తెలిపారు. సేవ్ డెమోక్రసీ -సేమ్ మునుగోడు ప్ల కార్డులతో చండూర్ ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. నియోజకవర్గంలో టిఆర్ఎస్ , బిజెపి పార్టీలు మద్యం, డబ్బులు విచ్చల విడిగా పంచుతున్నా ఎన్నికలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేశారు. వెంటనే ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ వారంతా కోరారు.

ఇదిలా ఉంటె… రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేపు సాయంత్రం 6 గంటల తర్వాత బయటి వారు ఎవరూ నియోజకవర్గంలో ఉండరాదని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం విస్తృత తనిఖీలు చేయాలని అధికారులు, బృందాలను ఆదేశించినట్లు వికాస్‌రాజ్ చెప్పారు. పెద్దమొత్తంలో ఎస్సెమ్మెస్‌లపై నిషేధం ఉందని, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు 479 ఫిర్యాదులు వచ్చాయని, 185 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 80 లక్షల నగదు, 4,500 లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 111 బెల్ట్ షాపులు మూసివేసినట్లు తెలిపారు.