పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పై అనర్హత వేటు

ఐదేళ్లపాటు నిషేధం విధించిన ఎలక్షన్ కమిషన్

imran-khan-disqualified-from-holding-public-office-for-5-years

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. విదేశీ నేతలు, ప్రతినిధుల నుంచి స్వీకరించిన ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్ముకున్నందుకు గాను ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఈ కాలంలో ప్రభుత్వ పదవులను చేపట్టడంపైనా నిషేధం విధించింది. ఈసీ తాజా నిర్ణయంతో జాతీయ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కూడా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ అయిన ఇమ్రాన్‌ కోల్పోయారు. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల ప్రధానాధికారి సికందర్ సుల్తాన్ రజా తెలిపారు.

తోషఖానా రిఫరెన్స్‌‌లో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు గాను ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్టు పాక్ మీడియా పేర్కొంది. ఎన్నికల కమిషన్ ప్రకటన వెలువడిన వెంటనే పీటీఐ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌదరి స్పందించారు. హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. కమిషన్ నిర్ణయాన్ని తిరస్కరించాలని ప్రజలను కోరారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. ఇమ్రాన్‌పై వేటువేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.


ఇమ్రాన్ అమ్మేసిన బహుమతులు ఇవే

ఇమ్రాన్ అమ్మేసిన బహుమతుల్లో గ్రాఫ్ రిస్ట్ వాచ్, కఫ్ లింక్స్ పెయిర్, ఖరీదైన పెన్ను, ఉంగరం, నాలుగు రోలెక్స్ గడియారాలు ఉన్నాయి. జులై 2018 నుంచి జూన్ 2019 వరకు ఇమ్రాన్ మొత్తంగా 31 విదేశీ బహుమతులు స్వీకరించారు. పాక్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రూ. 30 వేల కంటే తక్కువ విలువున్న బహుమతులను సొమ్ము చెల్లించకుండానే ప్రధాని తన వద్ద ఉంచుకోవచ్చు.

కాగా, తోషఖానా బహుమతులు, వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము వివరాలను ఇమ్రాన్ పేర్కొనలేదంటూ ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఆగస్టులో ఫిర్యాదు చేసింది. 70 ఏళ్ల ఇమ్రాన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. ప్రభుత్వ ఫిర్యాదుపై ఇమ్రాన్ గత నెలలోనే స్పందించారు. తాను ప్రధానిగా పనిచేసిన కాలంలో విదేశీ నేతల నుంచి స్వీకరించిన బహుమతుల్లో నాలుగింటిని అమ్మేసినట్టు అంగీకరించారు. అయితే, వాటిని తీసుకునేందుకు 21.56 మిలియన్ రూపాయలు చెల్లించానని, ఆ తర్వాత వాటి అమ్మకం ద్వారా 58 మిలియన్ రూపాయలు వచ్చాయని తెలిపారు.