హైదరాబాద్లో .. ఇమేజ్ టవర్
దావోస్: హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇమేజ్ టవర్ను నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇన్నోవేషన్, యానిమేషన్, మల్టీమీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ రంగాల కోసం రూ.1200 కోట్లతో 1.6 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ 2021 నాటికి పూర్తవుతుందన్నారు. దీన్ని ఆధునిక చార్మినార్గా ఆయన అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా దావోస్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింత విస్తరించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిచారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చోటా భీమ్ హైదరాబాద్కు చెందిన గ్రీన్గోల్డ్ సంస్థ అని, బాహుబలి లాంటి పలు భారీ సినిమాలకు కూడా హైదరాబాద్లో విజువల్స్ ఎఫెక్ట్స్ చేశారని, ఇందుకు అవసరమైన పూర్తి సాంకేతిక నైపుణ్యం, ఉత్తమ మానవవనరులు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీఎఫ్ఎక్స్, మల్టీమీడియాతో పాటు ప్రపంచ ప్రఖ్యాత గేమింగ్ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని పేర్కొంటూ.. ఈ విభాగాలను సన్రైజ్ సెక్టార్ గా అభివర్ణించారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇమేజ్ టవర్ను నిర్మిస్తున్నామని, కంపెనీలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు దీనిలో ఉంటాయని తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/