కళాశాలల్లో హెచ్‌ఐవి టెస్టులు..త్రిపుర సీఎం ఆదేశం

త్రిపుర రాజధాని అగర్తలాలో పెరుగుతున్న ఎయిడ్స్ కేసులు
డ్రగ్స్ వల్లే విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారన్న సీఎం విప్లవ్ కుమార్ దేవ్
డ్రగ్స్ మూలాలను కనుక్కోవాలని ఆదేశం

త్రిపుర : త్రిపుర రాజధాని అగర్తలాలో ఎయిడ్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. రాజధాని అగర్తలాలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ టెస్టులు చేయించాలని ఆదేశించారు. అగర్తలాలో పెద్ద సంఖ్యలో ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని… అందులో విద్యార్థులే అధికంగా ఉన్నారని చెప్పారు.

డ్రగ్స్ వల్లే ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని… డ్రగ్స్ వినియోగం వల్ల మనుషుల్లో ప్రతికూల మనస్తత్వం ఏర్పడుతుందని సీఎం అన్నారు. మాదకద్రవ్యాల వల్లే విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారని చెప్పారు. డ్రగ్స్ మూలాలను కూడా కనుక్కోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. అగర్తలాలో ప్రతిరోజు ముగ్గురు ఎయిడ్స్ బారిన పడుతున్నారు. వీరిలో విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో, సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/