మంచి ఆలోచనలే విజయానికి నాంది
వ్యక్తిత్వ వికాసం-
మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. దాని విలువ మన జీవన విధానాన్ని మార్చి వేస్తుంది. ఒక మనిషికి ఎంత విజ్ఞానం ఉన్నదన్నది ముఖ్యం కాదు.
తన విశ్వాసం అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్నది ముఖ్యం. మంచి పేరు పొందాలంటే నడవడి,
ఆలోచనాసరళి, సన్మార్గం క్రమశిక్షణ చాలా ముఖ్యం.
ఎదుటి వారితో మాట్లాడే విధానం ఉపయోగించే పదాలు, వ్యవహారశైలి వాదోపవాదాలు, చెప్పే సమాధానాలు సందర్భోచిత వ్యాఖ్యల మీద ఆధారపడి ఉంటాయి.
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అవగాహన చేసుకుని ఎదిరించి పరిష్కరించుకోవడం తప్ప వేటికీ భయపడకూడదు.
ప్రతిరోజు చిన్నదో, పెద్దదో ఒక విజయాన్ని అయిత సెలబ్రేట్ చేసుకోవాలి. నచ్చి పని చేయడం, ఇష్టమైన పుస్తకం చదవటం, పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవటం వకు అన్ని విలువైనవే.
ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్సాహం కలుగుతుంది. దానితో తృప్తి కలుగుతుంది. పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం నేర్చుకోవాలి.
ఆ రోజు ముఖ్యంగా అర్జంటుగా చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఒక లిస్ట్ రాయాలి.
వాటిలో ఏది ముందు, ఏది తరువాత చేయవలసిన పనులో చూసుకుని పూర్తి చేసుకోవాలి. టైమ్మేనేజ్మెంట్ అలవరచుకోవాలి. ఏ రోజు పనికి ఆ రోజు ప్రణాళిక వేసుకోవాలి.
సంతోషం కలిగించే అభిరుచులను, అలవాట్లను పెంచుకోవాలి. కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. బాధ్యతాయుతమైన జీవితం కుటుంబంలోని అందరిని సంతోషంగా ఉంచగలదు.
నెరవేర్చే ప్రతి బాధ్యత సంతోషాన్ని కలిగిస్తుంది. పని, ఆహారం, విశ్రాంతి, ఉల్లాసం అన్నీ సమపాళ్లలో ఉండే విధంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. లైప్ రిలాక్సింగ్గా, సంతోషంగా ఉంటుంది.
ఉన్నతమైన ఆలోచనతో ఉత్సాహంగా ఉండే స్నేహితులు ఉంటే సమస్యలు చాలా వరకు ఎదురు కావు. మన స్వభావం మూలంగా మనం కొని తెచ్చుకునే సమస్యలు ఎన్నో ఉంటాయి.
ఎప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉండటం వల్ల విజయాలు పొందగలం. విలాసవంతమైన జీవితం ఒక్కటే విజయవంతమైన జీవితం కాదు. శారీక సమస్యలుంటే ఎంత డబ్బున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు.
మన జీవితంలో సగభాగాన్ని డబ్బు సంపాదించేందుకు ఉపయోగిస్తాం.
మిగతా సగభాగం సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టి మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు నానా అవస్థలు పడుతూ ఉంటాం. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనబరచాలి.
మానవేసేవయే మాధవ సేవ అన్నది గొప్పమాట. మనం చేసే పని ఇతరులకు మేలు చేస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.
ఆ ఆనందం కోట్లు సంపాదించినా దొరకదు. సామాజిక సేవలోని ఆనందాన్ని ఆస్వాదించాలి. ఇతరులలోని మంచి గుణాన్ని గుర్తించగలగాలి.
మంచి వారితో పరిచయాలు పెంచుకోవాలి. ఏ పనైనా నిదానంగా, అసవరమైనంత వరకూ త్వరితంగా చేస్తే టెన్షన్కు గురికాకుండా ఉండగలం టెక్నాలజీ అన్నది ఎంతో అవసరమైనా కాని దానికి బానిస కాకూడదు.
టెక్నాలజీ ముసుగులో టివిలు, సెలఫోన్లు, ట్యాబ్లు విపరీతంగా వాడడం వల్ల పలు శారీరక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు.
కాలం కన్నా విలువైనది ఏదీ లేదు. దానిని అదనంగా మనకు ఇచ్చే శక్తి అసలే లేదు.
పొరపాట్లు చేయడం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించాలి.
తప్పులు ఎంచుకుంటూ పోతే ఒకరిపట్ల ఒకరు ఒక్కరోజైనా ప్రేమ చూపలేరు. మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువగా ఉంటుంది.
ప్రశాంతంగా ఉండేందుకు రోజూ ధ్యానంచేయాలి.
మంచితనాన్ని వ్యక్తిత్వంగా మలచుకోవాలి. అందువల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
అందరిలోనూ మంచి చూడడం బలహీనత అయితే ఈ ప్రపంచంలో అంత బలమైన వారు వేరొకరు ఉండరు. ఎప్పటికి మోసం చేయడం మంచి పద్ధతి కాదు.
అందువల్ల మనిషి తనలోని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మబలాన్ని కోల్పోగలడు. మోసంచేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవమైన విషయం.
అన్నం లేకపోవడమే పేదరికం కాదు. కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే పేదరికం.
బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు అందుకు కారణమైన వారిని వదిలివెయ్యడం మంచిది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి.
అందువల్ల సమయం ఆదా అవుతుంది. ఏదైనా ఒక పనిని నిర్ణీత సమంలో పూర్తి చేయకుండా రేపు చూసుకుందామని వాయిదా వేసుకుంటూ పోతే ఆ తరువాత జరిగే నష్టం అపారం.
జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలనుకునే వారు పనులు వాయిదా వేసే అలవాటును మానుకోవాలి.
తగిన సమయం కేటాయించుకుపోవడం, బద్ధకం తగిన ప్రణాళిక లేకపోవడం వల్ల వ్యక్తిత్వవికాసంపై ప్రభావం చూపుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/