ఆగస్టు 15 నాటికి కోవ్యాక్సిన్‌!

ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్త ప్రకటన

covaxine-gets-approved-for-clinical-trials

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌ కోసం ప్ర‌పంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. అయితే ఆగస్టు 15 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. క్రియారహిత వైరస్ ఆధారిత ఈ వ్యాక్సిన్, జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, నేడో, రేపో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా, క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 12 ఇనిస్టిట్యూట్ లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తామని, అన్ని క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు తొలివారం నాటికి పూర్తవుతాయని తెలియజేశాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్, తన భాగస్వాములందరికీ తెలియజేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసిన ఐసీఎంఆర్, ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్ కు సన్నద్ధమవ్వాలని సూచించింది. త్వరితగతిని ట్రయల్స్ ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/