బిజెపిలో చేరుతున్నానన్న వార్తలపై స్పందించిన పద్మారావు

i-will-not-leave-trs-until-my-last-breath-says-padma-rao-goud

హైదరాబాద్ :తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు టీఆర్ఎస్ ను వీడి బిజెపి లోకి చేరుతానని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ విషయమై సికింద్రాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఇవన్నీ ఒట్టి పుకార్లే అని స్పష్టం చేశారు. ఊపిరి ఉన్నంత కాలం టీఆర్ఎస్ ను వీడేది లేదని అన్నారు. పార్టీలో తనకు లోటు లేదని చెప్పారు. ఈ మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మారావు కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో, పద్మారావు బిజెపిలో చేరుతారన్న వార్తలు వచ్చాయి. అయితే, తాను కిషన్ రెడ్డి తో భేటీ అయినట్లు చెప్పడం సరికాదని పద్మారావు చెప్పారు. బిజెపిలోకి వెళ్తున్నట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా బిజెపి నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమ కాలం నుంచి జంట నగరాల్లో టీఆర్ఎస్ లో ఉన్న మొదటి వ్యక్తిని తానేనని పద్మారావు తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన తాను కూడా పార్టీ మారుతున్నానని పుకార్లు సృష్టించడం సరికాదన్నారు. ఇన్నేళ్లు బూర నర్సయ్య కు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఎంపీగా ఉన్నపుడు ఆత్మగౌరవం ఎటు పోయింది? అని ప్రశ్నించారు. ఉద్యమ కారులను అన్యాయం జరగలేదని, తాము ఎవరినీ మోసం చెయ్యలేదన్నారు. అలాంటివి నిరూపిస్తే పదవికి రాజీనామ చేస్తానని పద్మారావు సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ తో కలిసి మునుగోడు ఎన్నికల విషయమై చర్చించానని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందన్నారు. ప్రగతి భవన్ కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డు లేదని, కేసీఆర్ తో ఎలాంటి విభేదాలు లేవు అని పద్మారావు స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.