భారత్‌-చైనా ప్రజల శాంతి కోసం కృషి చేస్తా

భారత ప్రజలను ఇష్టపడతాను..అలాగే, చైనా ప్రజలనూ ఇష్టపడతాను

trump

వాషింగ్టన్‌: భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి సాధ్యమైనంత కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ అన్నారు. ఈ విషయాన్ని వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిధి కేలీ మెకనీ మీడియాకు తెలిపారు. చైనాకు భారత్‌కు మధ్య సరిహద్దు ముదురుతున్న నేపథ్యంలో అమెరికా భారత్‌కు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. నేను భారత ప్రజలను ప్రేమిస్తున్నాను అదేవిధంగా నేను చైనా ప్రజలను కూడా ప్రేమిస్తున్నాను. ఇరు దేశాల ప్రజలకు శాంతిని కలిగించడానికి నేను చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాను అని ట్రంప్‌ చెప్పినట్లు ఆమె తెలిపారు. కాగా, భారత్-‌చైనా దేశాల గురించి వైట్‌ హౌస్‌‌ ఆర్థిక సలహాదారుడు లారీ కుడ్లో కూడా మీడియాతో మాట్లాడారు. తమ దేశానికి భారత్‌ అతిపెద్ద ఆర్థిక భాగస్వామి అని, చైనాతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పుపై తాము చర్చించామని అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్‌ ఓబ్రియెన్ ఇదే విషయంపై స్పందిస్తూ.. భారత్‌ విషయంలో డ్రాగన్‌ దేశం దుందుడుకుగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షులతో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు బాహాటంగానే మద్దతుగా నిలుస్తున్నారని మరో అధికారి‌ అల్‌ మేసన్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/