నేను అస‌లు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ స‌భ్యుడినేనా?

ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలి

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ ధ‌ర్మపురి శ్రీ‌నివాస్ కుమారుడు ధ‌ర్మపురి అర‌వింద్ బీజేపీ ఎంపీగా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. డీఎస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. తాను కాంగ్రెస్‌లో పుట్టి పెరిగాన‌ని, త‌న తండ్రి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడం కోసం తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు నిన్న స్పష్టం చేశారు. దీంతో ఒకే ఇంట్లో మూడు పార్టీలు అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీనిపై డీఎస్ స్పందించారు. తాను ఏ పార్టీలో ఉన్నానన్న విషయం త‌నకే తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కు రావాలంటూ టీఆర్‌ఎస్‌ నుంచి త‌నకు ఆహ్వానాలు రావడం లేదని ఆయ‌న చెప్పారు. తాను అస‌లు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ స‌భ్యుడినేనా అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలని వ్యాఖ్యానించారు. ఒకే ఇంట్లో మూడూ పార్టీలంటూ తమపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో, భర్త ఇంకో పార్టీలో ఉన్నారని ఆయ‌న చెప్పారు. తాను గ‌తంలో పీసీసీ అధ్య‌క్షుడిగా చక్రం తిప్పానని తెలిపారు. త‌న కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరిన‌ప్పుడు కూడా తాను వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. అర‌వింద్ కష్టపడి గెలిచి లోక్‌స‌భ స‌భ్యుడు అయ్యాడని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/