ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

మూడో ఫ్రంట్ కానీ, నాలుగో ఫ్రంట్ కానీ బీజేపీని ఛాలెంజ్ చేస్తుందని భావించడం లేదు.. ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ: తదుపరి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడబోయే ఏ ఫ్రంట్ తోనూ తాను కలవబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. మూడో ఫ్రంట్ కానీ, నాలుగో ఫ్రంట్ కానీ ప్రస్తుత బీజేపీని చాలెంజ్ చేయగలదని తాను భావించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్ మోడల్ పని చేస్తుందనే నమ్మకం లేదని, అది ప్రాచీనమైన మోడల్ అని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల నేతలతో ఈరోజ పవార్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో ఫ్రంట్ తెరపైకి వస్తోందని… విపక్ష పార్టీలను ఏకం చేసే పనిని పవార్ తీసుకున్నారని… ఈ ఫ్రంట్ తో ప్రశాంత్ కిశోర్ చేతులు కలుపుతారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవార్ తో భేటీ సందర్భంగా ప్రస్తుత, భవిష్యత్ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్ లోతుగా చర్చించారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు ప్రశాంత్ తో భేటీ తర్వాత పవార్ మాట్లాడుతూ.. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, వ్యూహాలకు సంబంధించి బ్లూప్రింట్ తయారు చేసేందుకు ప్రశాంత్ కిశోర్ కు ఉన్న అనుభవం, నెట్ వర్కింగ్ స్కిల్స్ ఉపయోగపడతాయని చెప్పారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/