కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై నేను స్పష్టంగానే ఉన్నా: రాహుల్ గాంధీ
నవంబర్ 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నిక
న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు తాను అధ్యక్షుడిగా ఉంటానా, లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తానేం చేయాలనుకున్నానో ఇప్పటికే నిర్ణయించుకున్నానని.. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారా అని ప్రశ్నించగా.. ఈ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నవంబర్ 17న ఎన్నిక జరగనుంది. రెండు రోజుల తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.
కాగా, కాంగ్రెస్ లో నూతన జవసత్వాలు నింపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్ వరకు కొనసాగించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/