తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫై హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్

తెలంగాణ ఇంటర్ విద్యార్థులు గమనించాల్సిన వార్త. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్బోర్డు అధికారులు నిర్ణయించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా పరీక్షల టైంటేబుల్లో మార్పులు జరిగాయి. ఉపఎన్నిక నేపథ్యంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకొని, ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ సెకండియర్లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబర్ రెండు వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
అక్టోబర్ 30 వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. నవంబర్ 2 వ తేదీన ఉప ఎన్నిక ఫలితాలు వెలువడునున్నాయి. ఎన్నికల నిర్వహణ ముందు అంటే.. అక్టోబర్ 29 వ తేదీ మరియు 30 వ తేదీ లలో హుజురాబాద్ నియోజక వర్గంలో 144 సెక్షన్ విధిస్తారు. ఇంటర్మిడియేట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… సెప్టెబర్ 24 నే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ లెక్కన అక్టోబర్ 29 వ తేదీన ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరుగనుండగా.. 30 వ తేదీన.. కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. దీంతో పరీక్ష నిర్వహణ దాదాపుగా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖాధికారులు ముందు.. ఆ తేదీన జరిగే పరీక్షలను వాయిదా వేయడం లేదా… సెంటర్లను తరలించడం వంటివి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి దీనిపై ప్రభుత్వం తో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.