క్లోరోక్విన్ ట్రయల్స్కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
లండన్: కరోనా చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్ ట్రయల్స్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతినిచ్చింది. గతంలో ఈ క్లినికల్ ట్రయల్స్ను డబ్ల్యూహెచ్ఓ అనుమతించలేదు. ఈ ఔషధానికి సంబంధించిన సేఫ్టీ డేటాను నిపుణులు పరిశీలించారని, ఆ తరువాతే క్లినికల్ ట్రయల్స్ను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియెసస్ తెలిపారు. కాగా గతంలో కరోనా రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటే, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఓ కథనం ప్రచారం అయింది. దాంతో మే 25వ తేదీ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో నిషేధం విధించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ బృందం తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నది. గతంలో ముందుస్తు జాగ్రత్తగా ఆ ట్యాబ్లెట్లపై తాత్కాలిక నిషేధం విధించామని, సేఫ్టీ డేటాను సమీక్షించిన తర్వాత మళ్లీ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలపై ట్రయల్స్ కొనసాగించాలని నిర్ణయించినట్లు డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/