కొంపల్లిలో కరోనా వైరస్ కలకలం
ఇటలీ నుంచి వచ్చిన పేట్బషీరాబాద్ మహిళ
హైదరాబాద్: కరోనా వైరస్(కొవిడ్-19) భారత్లో కలవరం సృష్టిస్తుంది. ఈవైరస్ ఇప్పుడు కొంపల్లిని తాకింది. నగరంలోని పేట్బషీర్బాద్కు చెందిన మహిళ ఇటలీలో ఉంటోంది. ఇటీవల ఆమె నగరానికి వచ్చింది. అనారోగ్యంగా ఉండడంతో ఇంట్లో కాకుండా కొంపల్లి సమీపంలోని ప్రజయ్ గృహతార అపార్ట్మెంట్ల సమీపంలో ఉండే ఓ హోటల్లో దిగింది. గత నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు అక్కడే బసచేసింది. ఆ తర్వాత షాపూర్లోని మరో హోటల్లో ఆరు రోజులు ఉంది. అనారోగ్యం తగ్గకపోవడంతో ఇటీవల ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమె ఇటలీ నుంచి ఎప్పుడు వచ్చింది? నగరంలో ఎక్కడెక్కడ ఆమె బసచేసింది? ఎవరెవరిని కలిసింది అన్న వివరాలు సేకరించాలంటూ మేడ్చల్ జిల్లా వైద్యాధికారులకు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్యాధికారులు కొంపల్లిలోని ఆమె బసచేసిన హోటల్కు వెళ్లి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే, వివరాలు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించడంతో ఎస్సై పరశురాం హోటల్ కు వెళ్లి వివరాలు సేకరించారు. తొలుత సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీలకు వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/