ఒమిక్రాన్ వ్యాప్తి.. కంటైన్మెంట్ జోన్‌గా టోలిచౌకీ

హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. మెహిదీపట్నంలోని టోలి చౌకి ప్రాంతాన్ని మరోసారి కంటోన్మెట్ జోన్‌గా ప్రకటించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆ రెండు కేసులు వెలుగు చూసిన పారామౌంట్ కాలనీలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగనున్నాయి. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు. బాధితులు కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు వైద్యాధికారులు. కరోనా ఏ వేరియంట్‌కైనా ఒకటే ఆయుధం. మాస్క్‌. సక్రమంగా పెట్టుకుంటే ఏ వైరస్‌ దరిచేరదని చెప్తున్నారు DM శ్రీనివాసరావు.

హైదరాబాద్‌ మహానగరంలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించిన విదేశీయులు నివసిస్తున్న ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. ఆ కాలనీలు, అపార్ట్‌మెంట్లలో అధికారులు ఆ ఇద్దరితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. నిన్ననే టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీ మొత్తం యాంటీబాక్టీరియల్ మందును స్ప్రే చేశారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులకు దగ్గరగా ఉన్నవారి నమూనాలను పరీక్షలకు పంపారు. ఆ ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కెన్యా, సోమాలియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్‌ పాజిటివ్ ఉన్నట్లు బయట పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిని ఆరోగ్య శాఖ అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేరియంట్‌ అతి వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం పెద్ద సవాలుగా మారింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/