శాంసంగ్లో భారీ స్కాం
కటకటాల్లోకి వైస్ చైర్మన్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ఫోన్లు, మెమరీ చిప్ల తయారీ కంపెనీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఈ స్కాండల్లో కంపెనీ వైస్ చైర్మన్ లీ జె-యోంగ్ ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో దక్షిణ కొరియా న్యాయస్థానం ఆయనకు రెండున్నరేళ్లు కారాగార శిక్ష విధించింది.
దక్షిణ కొరియా మాజీ దేశాధ్యక్షురాలు పార్క్ గ్వేన్-హైని పదవీచ్యుతురాలిని చేయడానికి లీ యోంగ్ పెద్ద ఎత్తున లంచం ఇచ్చినట్లు తేలింది.
దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆయనకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది.
దేశ రాజకీయాలు, అధికార మార్పిడిచోటు చేసుకున్న ప్రతీసారీ పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వార్తలను వినాల్సి రావడం బాధ కలిగిస్తోందని పేర్కొంది. ఇదివరకు శాంసంగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా లీ యోంగ్ తండ్రి పనిచేశారు.
ఆయన దీర్ఘకాలం పాటు అనారోగ్యానికి గురయ్యారు. బెడే పరిమితమైన ఆయన గత ఏడాది అక్టోబర్లో గుండెపోటుతో మరణించారు. తండ్రి స్థానాన్ని లీ జె-యోంగ్ భర్తీ చేశారు. ఇదివరకు పార్క్ గ్వెన్-హై నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో కుప్పకూలిపోయింది.
లంచం తీసుకున్నట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇప్పుడామె జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇందులో లీ యోంగ ప్రమేయం కూడా ఉన్నట్లు 2016లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లోనే ఆయనపై కేసు నమోదైంది.
దీనిపై విచారణ కొనసాగుతూ వచ్చింది. తాజాగా అవినీతి, లంచం ఆరోపణల్లో లీ యోంగ్ ప్రమేయం ఉన్నట్లు సియోల్ సెంట్రలక్ష డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ధారించింది. రెండున్నరేళ్లు కారాగార శిక్షను విధించింది. ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా పేరున్న శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ జైలుపాలు కావడం కార్పొరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/