పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటారా? :లోకేశ్

నేను పర్మిషనే అడగనప్పుడు… ఎలా తిరస్కరిస్తారు?.. లోకేశ్ మండిపాటు

అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను… గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుని, కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. ఆయన కాన్వాయ్ చుట్టూ పోలీసు వాహనాలు ప్రయాణిస్తున్నాయి.

మరోవైపు, ఎయిర్ పోర్టు వెలుపల తన వాహనంలో కూర్చున్న నారా లోకేశ్ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. మీ పర్యటనకు అనుమతిని నిరాకరించారంటూ ఓ పోలీస్ అధికారి సమాధానమివ్వడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పర్యటన కోసం అసలు అనుమతినే అడగలేదని… అలాంటప్పుడు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తాను ధర్నా చేయడం లేదని, పాదయాత్ర చేపట్టడం లేదని… కేవలం ఒక కుటుంబాన్ని పరామర్శించి, అక్కడ మీడియాతో మాట్లాడి, అనంతరం తిరిగి వెళ్లిపోతానని చెప్పారు. అయినప్పటికీ తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. ఏది తప్పో, ఏది ఒప్పో తనకు తెలుసని… తనపై ఎలాంటి కేసులు లేవని లోకేశ్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/