వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
విజయవాడ: సీఎం జగన్ విజయవాడలో వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. 500ఏసీ వాహనాలను ప్రారంభించారు. డెలివరీ అయిన తల్లీ బిడ్డలను ఉచితంగా వారి ఇంటికి ఈ వాహనాలు చేర్చనున్నాయి. జీపీఎస్ సౌకర్యంతో వాహనాలు నడవనున్నాయి. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ యాప్ ను ఏపీ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 102కి డయల్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏడాదికి సగటున 4లక్షల మందికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవి, వసతులు కూడా సరిగా ఉండేవి కావు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/