వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సిఎం
విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్ఆర్ ‘ పుస్తక ఆవిష్కరణ
ఇడుపులపాయ: నేడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 71వ జయంతి. ఈసందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సిఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా “నాలో.. నాతో వైఎస్సార్” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ… ’33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించిన సమయంలో నేను ఆయనలో చూసిన మంచితనం, ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను. ఆయన గురించి రాయాలని నాకు అనిపించింది. ఆయనలో మూర్తీభవించిన మానవత్వం గురించి, ఆయన మాటకు ఇచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలను ఆయన వెలుగునిచ్చారు’ అని చెప్పారు.
‘ఈ అంశాలన్నీ ఆయనలో చూశాను.. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నా కొడుకు, కోడలు.. కూతురు, అల్లుడు ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో వైఎస్సార్ మాటలను గుర్తు తెచ్చుకుని వాటి స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి వారు కూడా వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తూ నేను ఈ పుస్తకం రాశాను’ అని విజయమ్మ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/