‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ హెచ్చరిక

అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలను సహించం
రాజ్యాంగం పరిధిలో పరిష్కరించుకుంటాం


న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. విదేశాల్లో మత స్వేచ్ఛను పర్యవేక్షిస్తూ, దానిపై రిపోర్ట్ చేసే అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్ అంబాసిడర్, రషీద్ హుస్సేన్ హిజాబ్ వివాదంపై మాట్లాడడం గమనార్హం. కర్ణాటక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. స్కూళ్లలో హిజాబ్ ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో వస్త్రధారణ పట్ల కొన్ని దేశాల స్పందనపై.. మీడియా కోరుతున్న విచారణలకు మా స్పందన ఇదే’’ అని పేర్కొన్నారు.

‘‘కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో వస్త్రధారణ అంశం కర్ణాటక హైకోర్టు న్యాయ సమీక్షలో ఉంది. మా రాజ్యాంగ నిర్మాణం, యంత్రాంగాలు, మా ప్రజాస్వామ్య విలువలు, రాజకీయం పరిధిలో అంశాలను చర్చించి, పరిష్కరించుకుంటాం. భారత్ గురించి సరైన అవగాహన ఉన్నవారు వాస్తవ అంశాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. మా అంతర్గత అంశాలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఆమోదించం’’ అంటూ బాగ్చి పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/