అయ్యన పాత్రుడు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ.. మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. అంతే కాదు అయ్యనపాత్రుడు పై నిర్భయ కేసుతో సహా 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో.. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు.

అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ అయ్యన్న అనుచరుల ఆందోళనకు దిగారు. కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాకుండా మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లే దారులని పోలీసులు మొత్తం మూసివేశారు. అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల విద్యుత్‌ సరఫరా నిలిచింది. అర్ధరాత్రి నుంచే.. విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు.

అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం అయ్యన్న ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.