ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టు సీరియస్‌

ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ఎందుకు..

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఆన్‌లైన్‌ క్లాసుల‌ నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్‌ సమావేశం అనంతరం విద్యాసంవత్సరం ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకుందని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదన్న ప్రభుత్వం… వాటిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వం ధ్వంద్వ వైఖరిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని నిలదీసింది. ఇక విద్యార్థుల కెరీర్ కోసం నెల రోజులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామన్న విద్యా సంస్థల తరఫు న్యాయవాది వాదించారు.

తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభించిపోతుందని అన్నారు. అయితే ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్‌లు కొనే పరిస్థితి ఉందా ? అని హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవద్దని సూచిచింది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. కార్మికులు, న్యాయవ్యవస్థతో పాటు ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించిందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, సీబీఎస్ ఈ వాదనలు కూడా వింటామని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 13కి వాయిదా వేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/