తెలంగాణలో ఒమిక్రాన్ పై హైకోర్టులో విచారణ
న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్
HIgh court of Telangana
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న వేళ దీనిపై ఆందోళన నెలకొంది. దీనిపై ఈ రోజు హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని లాయర్లు వాదించారు. పబ్బులు, బార్లలో వేడుకలకు సమయాన్ని మరింత పెంచారరని లాయర్లు హైకోర్టుకు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది. నూతన సంవత్సర వేడుకల విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని హైకోర్టు వివరించింది. వేడుకలపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారని గుర్తు చేసింది. తెలంగాణలో మొదటి డోసు వంద శాతం పూర్తయిందని న్యాయస్థానం చెప్పింది. అయితే, కరోనాపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. కరోనా మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తమకు వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసును ఈ నెల 4కు వాయిదా వేసింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/