బీజేపీ కి హైకోర్టు గుడ్ న్యూస్..రేపు వరంగల్ సభకు గ్రీన్ సిగ్నల్

వరంగల్ లో బీజేపీ సభ ఉంటుందా..ఉండదా అని అంత టెన్షన్ పడుతుండగా..హైకోర్టు సభకు అనుమతి ఇచ్చి కార్య కర్తలకు ఊపిరి పోసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర రేపటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా హన్మకొండలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో.. సభకు పోలీసుల నుంచి అనుమతి లేదంటూ అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ నిన్న లేఖ రాసిన సంగతి తెలసిందే. దీంతో బీజేపీ నాయకులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, ఆ మేరకు హామీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ..ఈరోజు నుండి 31 వరకు వరంగల్ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. అయితే, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహణకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. మరి పోలీసులు అనుమతి ఇస్తారో లేదో చూడాలి.