శ్రీవారి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన
తిరుమల శ్రీవారి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించింది టీటీడీ. తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులుతరలివస్తున్నారు. శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. వారాంతం కావడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పరీక్షలు పూర్తవడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో వేంకటేశ్వరుడి దర్శనానికి తరలివచ్చారు.
ఈ క్రమంలో భక్తులకు టీటీడీ ఓ విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజుల పాటు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటూ భక్తులకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు చేరుకున్నారు. సర్వ దర్శనం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. ఫలితంగా సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఏకంగా 48 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఇప్పటికే తిరుమలకు చేరుకున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, మరింత మంది పెరిగితే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీకి ఇబ్బందిగా మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు క్యూలైన్లలో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. వైకుంఠం కాంప్లెక్స్ వెలుపల ఉన్నవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.