నేపాల్లో భారీ వర్షాలు..విరిగిపడ్డ కొండచరియలు
వర్షాల కారణంగా 16 మంది మృతి..22 మంది గల్లంతు
ఖాట్మండు: నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది గల్లంతయ్యారు. భారీ వరదలు వస్తుండడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదని అక్కడి అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రధానంగా సింధుపాల్చోక్, మనంగ్ జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది.
మరోపక్క, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను నేపాల్ ఆర్మీ ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. పర్వతాలపై మంచు కరగడంతో సింధుపాల్ చౌక్ జిల్లాలో వరద పోటెత్తిందని అధికారులు చెప్పారు. అలాగే, ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో నీటి మట్టం పెరిగిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/