హైదరాబాద్ అంత చీకటిగా మారింది
హైదరాబాద్ మహానగరం చీకటి నగరం గా మారింది. గులాబ్ తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుండి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక సాయంత్రం ఐదు గంటల సమయంలోనే రాత్రి వాతావరాణాన్ని తలపించింది. చిమ్మ చీకటిగా మరి భారీ వర్షం కురుస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణశాఖ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో గులాబ్ తుఫాన్ ఉదృతి ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన గులాబ్. 11 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిషాలోని గోపాల్పూర్ మధ్య తుఫాను కేంద్రం తీరాన్ని దాటినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కొద్ది సేపటి క్రితమే తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. గులాబ్ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా పడింది. మూడు జిల్లాల్లోను వర్ష తీవ్రత పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య గులాబ్ ప్రభావం భారీగా ఉంది. పలుచోట్ల చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.